‘ఆంటీ’ ట్రోల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు

  • ఫిర్యాదు చేయడానికి ముందు బాగా ఆలోచించానన్న అనసూయ
  • ఫిర్యాదు స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన యాంకర్
  • సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్ చెప్పిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ అన్నంత పనీ చేశారు. హెచ్చరించినట్టుగానే తనను ట్రోల్ చేస్తున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే సమయం వచ్చేసిందని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఫిర్యాదు చేయడానికి ముందు చాలా ఆలోచించానని, కానీ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. 

తన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ అధికారులు స్పందించి, తనకు మద్దతు ఇచ్చారంటూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనసూయ దాని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అలాగే, #SayNoToOnlineAbuse #StopAgeShaming అనే హ్యాష్‌ట్యాగ్స్ తగిలించారు.

ఇటీవల విడుదలైన ఓ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న వెంటనే అనసూయ ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా’ అని ట్వీట్ చేశారు. ఇది చూసి నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆ నటుడి అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కామెంట్లు, మీమ్స్‌తో అనసూయను ఆడేసుకున్నారు. 

ఇంకొందరు ‘ఆంటీ’ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇది అనుసూయ కోపానికి కారణమైంది. తనను కావాలనే 'ఆంటీ' అంటూ అవమానిస్తున్నారని పేర్కొన్న అనసూయ.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అన్నట్టుగానే తాజాగా ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anasuya Bharadwaj
Anchor
Actress
Cyber Crime
Trolls

More Telugu News